గురు భైరవైక్య మందిరం.. PM మోదీ ప్రారంభించిన ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే..!

 

గురు భైరవైక్య మందిరం.. PM మోదీ ప్రారంభించిన ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే..!

 కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  మాండ్యా జిల్లా, ఆదిచుంచనగిరిలో శ్రీ గురు భైరవైక్య ఆలయాన్ని ప్రారంభించారు. గురు భైరవైక్య ఆలయం కేవలం ఒక పూజ స్థలం మాత్రమే కాదు, భక్తి, తపస్సు,  ఆధ్యాత్మికత.. అన్నింటి కలయిక. ఈ ఆలయాన్ని శ్రీ శ్రీ శ్రీ బాల గంగాధరనాథ్ మహాస్వామిజీ స్మృతికి గుర్తుగా నిర్మించారు. ఈ ఆలయ విశేషాల గురించి తెలుసుకుంటే..

గురు భైరవైక్య అంటే..

భైరవైక్య అనే పదానికి భైరవునిలో లీనం కావడం లేదా భైరవునితో ఏకత్వం పొందడం అని అర్థం. ఈ ఆలయం ఈ ప్రాంతపు ప్రాచీన శైవ సంప్రదాయంతో ముడిపడి ఉంది. భైరవ స్వామిని శివుని గణంగా భావిస్తారు. ప్రధానమంత్రి ఇక్కడ ప్రార్థనలు చేశారు. ఆదిచుంచనగిరి మఠానికి 71వ అధిపతి అయిన శ్రీ శ్రీ శ్రీ బాల గంగాధరనాథ్ మహాస్వామిజీ పవిత్ర స్మృతికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. బాల గంగాధరనాథ్ మహాస్వామిజీ  సాంఘిక సేవా కార్యక్రమాల ద్వారా అందరికీ సుపరిచితులే..

బాలగంగాధరనాథ్ స్వామీజి చరిత్ర..

శ్రీ శ్రీ శ్రీ డా. బాల గంగాధరనాథ్ మహాస్వామిజీ 1945లో కర్ణాటకలో జన్మించారు. చిన్నతనం నుంచే ఆయనకు ఆధ్యాత్మికత, సేవ, క్రమశిక్షణతో కూడిన జీవితం పట్ల ఆసక్తి ఉండేది. చిన్న వయసులోనే ఆయన ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠంలో చేరి , గురు-శిష్య సంప్రదాయం కింద విద్యను, ఆధ్యాత్మిక సాధనను పొందారు. ఆయన నాయకత్వంలో ఆ మఠం మతపరమైన రంగాలలోనే కాకుండా విద్యా, సామాజిక రంగాలలో కూడా విస్తరించింది.

శ్రీ గురు బైరవైక్య ఆలయ ప్రత్యేకతలు..

శ్రీ గురు భైరవైక్య దేవాలయం సాంప్రదాయ ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఈ ఆలయ నిర్మాణానికి సుమారు రూ. 80 కోట్లు ఖర్చయింది, ఇది దాని వైభవాన్ని, వాస్తుశిల్పాన్ని ప్రతిబింబిస్తుంది. సాంప్రదాయ ద్రావిడ వాస్తుశైలిలో నిర్మించబడిన ఈ ఆలయం, శ్రీ బాల గంగాధరనాథ్ స్వామిజీ జీవితానికి, వారసత్వానికి నివాళిగా స్థాపించబడింది.

 ఆదిచుంచనగిరి మఠం ఒక సిద్ధ పీఠంగా పరిగణించబడుతుంది, ఇక్కడ ఋషులు సంవత్సరాల తరబడి ధ్యానం చేసి ఆధ్యాత్మిక సిద్ధులను పొందారు. ఇక్కడి శక్తి, వాతావరణం అత్యంత పవిత్రమైనవిగా, శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి. ఈ కారణంగా దేశం నలుమూలల నుండి భక్తులు, సాధకులు దర్శనం, ధ్యానం కోసం ఇక్కడికి వస్తారు.

 దక్షిణ భారతదేశంలోని ప్రాచీన సిద్ధ పీఠాలలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీనిని ఆధ్యాత్మిక సాధన, తపస్సు , గురు-శిష్య సంప్రదాయానికి సజీవ ఉదాహరణగా పరిగణిస్తారు.  ప్రస్తుతం ఈ మఠానికి 72వ పీఠాధిపతి అయిన శ్రీ శ్రీ శ్రీ నిర్మలానందనాథ్ స్వామిజీ నాయకత్వం వహిస్తున్నారు.

                           *రూపశ్రీ.